BS RAO: శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత కన్నుమూత

BS RAO: శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత కన్నుమూత
చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు


శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. బీఎస్‌ రావు భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. ఇంగ్లండ్‌, ఇరాన్‌లో డాక్టర్లుగా పనిచేసిన బీఎస్‌రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు. 1986లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల స్థాపనతో.... శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సంస్థ స్థాపకులు, మార్గనిర్దేశకులు అయిన డాక్టర్ బి.యస్.రావు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి వైద్య వృత్తిలో బాగా రాణించి ఇంటర్మీడియట్ విద్య కొరకు ఒక కొత్త ఒరవడిమీద దృష్టి సారించి సక్సెస్‌ అయ్యారు. వీరు ప్రవేశపెట్టిన ప్రణాళికా బద్ధమైన విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యా ముఖచిత్రాన్నే మార్చివేసింది. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలోని ప్రీయూనివర్సిటీ స్థాయి విద్యలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.

డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో విజయవాడలో 1986లో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైంది. ఒకే ఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ సంస్థ నేడు 301 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది.

ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థలు తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదో తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. పదో తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. విద్యార్థులు వెనుకబడినట్లయితే వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇప్పించేవారు.

అప్పట్లో ఎంసెట్‌కు కోచింగ్‌కు కేరాఫ్‌గా ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటి విస్తరించటం అనేది 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటీ -జేఈఈ, ఏఐఈఈఈ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన లక్షలాది మంది ఇంజినీర్లుగా,డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.

Tags

Next Story