ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమైందన్న సీఐ సమాధానంపై పట్టాభి తీవ్ర అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. మొన్న రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం జరిగితే..నేడు విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న..శ్రీసీతారామ మందిరంపై దాడికి పాల్పడ్డారు. దేవాలయానికి తాళం వేసి ఉన్నా..కొబ్బరి బోండాలతో విగ్రహాలను కొట్టారు. ఈ దాడిలో సీతాదేవి విగ్రహం ధ్వంసమైంది.
అటు.. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు శ్రీసీతారామ మందిరానికి చేరుకున్నారు. సీతాదేవి విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ జరపాలన్న టీడీపీ నేత పట్టాభి పోలీసులను కోరారు. ఐతే.. ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందని సీఐ సత్యానందం అన్నారు. సీఐ సమాధానంపై పట్టాభి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యత గల పోలీస్ అధికారిగా నిర్లక్ష్యంగా ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్న దేవాలయంపై దాడిని ఆపలేకపోయారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వెంటనే మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే..ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com