భరతనాట్యం చేస్తూ శ్రీవారి సన్నిధికి..

ఏడుకొండలవాడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు డాక్టర్ పి. కృష్ణవాసు శ్రీకాంత్. భరతనాట్యం చేస్తూ మెట్లమార్గం గుండా శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఈమొత్తం ప్రయాణానికి ఆయనకు 75 నిమిషాలు సమయం పట్టింది. సాధారణంగా నడుచుకుంటూ వెళితే దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఆయన నాట్యం చేసుకుంటూ వెళ్లారు. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావు పేటకు చెందిన శ్రీకాంత్ భరతనాట్య కళాకారుడు. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. నాట్యం మీద ఉన్న మక్కువ, మరింత మందికి చేరువ చేయాలనే తపన ఉన్న శ్రీకాంత్ కళల పట్ల, నాట్యం పట్ల అభిరుచి ఉన్న వ్యక్తులు భరత నాట్యాన్ని అభ్యసించాలని అభిలషిస్తున్నారు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ శ్రీవారి సన్నిధిని చేరుకున్నట్లు తెలిపారు. శ్రీనివాసుడి ఆశీస్సులతోనే తానీ ప్రయత్నానికి పూనుకున్నానని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com