AP: మద్యం తాగి విధులకు హాజరైన శ్రీశైల ఆలయ ఉద్యోగి

మద్యం తాగి ఆలయంలో విధులకు హాజరైన ఉద్యోగికి తగిన శాస్తి జరిగింది. శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్లో నిన్న(గురువారం) రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సహాయ కార్యనిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన్ను నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com