NTR:అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టింది: బాలకృష్ణ

తన తండ్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. ఆయనకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు రామకృష్ణ, నందమూరి సుహాసిని, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని పేర్కొన్నారు.పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలయ్య గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్కు ముందు.. తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు. ఇప్పటికీ ఆయన తెచ్చిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వివిధ వర్గాలకు ఎన్టీఆర్ దైవ సమానంగా నిలిచారని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్లిచ్చిన మహానభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది కూడా ఎన్టీఆర్ మాత్రమేనని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ వారసుడు లోకేశ్
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబీకులు, రాజకీయ నేతలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు వారసుడు నారా లోకేష్ అని ఉద్ఘాటించారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. తమను కించపరుస్తున్నారన్న లక్ష్మీపార్వతి వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు.
జవహర్ నివాళులు
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జవహర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com