AP: నందిగం సురేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ

AP: నందిగం సురేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ
X
బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... జోక్యోం చేసుకోబోమన్న ధర్మాసనం

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ హత్య కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో నందిగం సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నందిగం సురేశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు పూర్తి సమయం ఇవ్వాలన్న నందిగం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతేకాదు పలు కేసుల్లోనూ ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయనను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మరియమ్మ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 27 డిసెంబర్ 2020లో మరియమ్మ హత్య జరిగింది.

కపిల్ సిబల్ వాదనలు

మరియమ్మ హత్య కేసుతో సురేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని, దళితుల్లోని రెండు వర్గాల మధ్య అల్లర్లకు ఉసిగొల్పినట్టు ఆరోపిస్తున్నా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు నిరూపించే ఒక్క సాక్షి కూడా లేరని సురేశ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. పటిషనర్‌ను ఇరికించేందుకే ఈ కేసు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్‌లో నందిగం సురేష్ పేరు ఆరుసార్లు ఉన్నట్టు చెప్పారు. అల్లర్లకు వ్యూహకర్త ఆయనేనని, అనుచరులకు డబ్బు, మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడికి ఉసిగొల్పారని తెలిపారు. దాడిలో పాల్గొన్న 36 మందిని పోలీసులు గుర్తించినట్టు పేర్కొన్నారు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం వంటి 9 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆరోపించారు.

బెయిల్‌కు నిరాకరించిన ధర్మాసనం

ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ ‌కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బెయిలు ఇచ్చేందుకు విముఖత చూపింది. ఎఫ్ఐఆర్‌లో అందరినీ నిందితులుగా చేర్చి సురేష్‌ను మాత్రమే మినహాయించడానికి కారణమేంటని ప్రశ్నించింది. మీ పార్టీ అధికారంలో ఉండటం వల్లే ఎఫ్ఐఆర్ నుంచి తప్పించారని అభిప్రాయపడింది. బెయిలు పిటిషన్‌లో పాత కేసుల వివరాలు ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది.

Tags

Next Story