సాక్ష్యాలు తారుమారు..బెయిల్ క్యాన్సిల్..?

సాక్ష్యాలు తారుమారు..బెయిల్ క్యాన్సిల్..?
అవినాష్‌ ముందస్తు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ... సునీత స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం.

వివేకా హత్య కేసులో.. 8వ నిందితుడైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.... ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ... సునీత స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగా... తన పిటిషన్లో అనేక అంశాలను ప్రస్తావించారు సునితారెడ్డి. తెలంగాణ హైకోర్టు పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని... CBI సేకరించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన అంశాలకు విరుద్దంగా హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అటు... అవినాష్ రెడ్డి సైతం CBI దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు. చివరిగా సీబీఐ మూడు సార్లు ఇచ్చిన నోటీసులకు అవినాష్‌ హాజరు కాలేదని... తల్లి అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో మకాం వేశారన్నారు. ఇక... ఆయన్ను CBI అరెస్టు చేయకుండా మద్దతుదారులు అడ్డుపడ్డారని గుర్తు చేశారు.

వివేక హత్య జరినప్పుడు స్థానిక పోలీసుల సమక్షంలోనే అవినాష్ రెడ్డి.... ఆధారాలు చెరిపేశారన్నారు. అంతేకాదు... గుండెపోటుతో చనిపోయినట్లు కథ అల్లి ప్రచారం చేశారన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా అవినాష్‌ అడ్డుకున్నట్లు తెలిపారు. ఓ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డి.... సాక్ష్యుల్ని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక... CBI అధికారులపైనా తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెట్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికార యంత్రాగంతో పాటు అధికారపార్టీలోని కీలక వ్యక్తుల సహాయంతో సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వివేకాహత్య.... ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్‌రెడ్డికి తెలుసని CBI పేర్కొందని... తన పిటిషన్‌లో వెల్లడించారు సునీతారెడ్డి. ఈనెల 30వ తేదీకి దర్యాప్తు పూర్తి చేయాలని CBIని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు.

తెలంగాణ హైకోర్టు తీర్పులోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని... సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు అడ్డుగా నిలిచే అవకాశం ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పునకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఏకంగా ఓ మినీ ట్రయల్ని నిర్వహించిందన్నారు. అంతేకాకుండా... అవినాష్ రెడ్డితో పాటు వారి తరపువారి వాదనలనే పరిగణలోకి తీసుకున్నట్లు కనబడుతోందన్నారు. సాక్ష్యుల్ని బెదిరించడం వల్లే సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిందని తెలిపారు. వివేకా హత్య కేసుsలో... విస్తృత కుట్ర కోణాన్ని తేల్చాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాష్‌ ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు సునీతారెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story