LOKESH: తీపి కబురు..ఉగాదికి జాబ్ క్యాలెండర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా 8వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలోని విద్యావ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. విశేషమేమిటంటే, ఈ జాబ్ క్యాలెండర్లోనే డీఎస్సీ(DSC) పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేలాది మంది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(KGBV) పనితీరుపై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే మురళీ మోహన్ పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీలో కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడా అందిస్తున్నారని, ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎంటిఎస్(MTS) అమలు చేయాలని, రెగ్యులర్ ప్రిన్సిపాళ్లను నియమించాలని కోరారు. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానమిస్తూ.. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కేజీబీవీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
పాలిటెక్నిక్, ఐటీఐ విద్య బలోపేతం
ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ఉత్తరాంధ్రలో ఏర్పడుతున్న పారిశ్రామిక ఎకో సిస్టమ్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులను 'క్లస్టర్ బేస్డ్ అప్రోచ్' ద్వారా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేసిన ప్రకటన ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థుల్లో మరింత ఆశలు రేపింది. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అందులో డీఎస్సీ ఉంటుందని అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగులు పలుమార్లు రోడ్డెక్కి దర్నాలు, నిరసనలు చేసిన దాఖలాలున్నాయి. కూటమి పార్టీలు ఎన్నికల ముందు మెగా డీఎస్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే 16 వేల పోస్టులతో ప్రకటన ఇచ్చింది. అనేకమంది ఉపాధ్యాయ కొలువులు సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
