TDP : చంద్రబాబు అధ్యక్షతన... నేడు విశాఖలో క్లస్టర్స్ యూనిట్స్ మీటింగ్

ఇవాళ విశాఖలో టీడీపీ జోన్ 1 క్లస్టర్స్ యూనిట్స్ మీటింగ్ జరగనుంది. పీఎంపాలెం విశాఖ కన్వెన్షన్ కేంద్రంలో టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు రివ్యూ కొనసాగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడంతో భాగంగా టీడీపీ జోన్ల వారీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. సదస్సు నిర్వహణకు పార్టీ యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి యూనిట్ బాధ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జులు కలిపి 2వేల 500మంది వరకు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అంతా కలిపి 3వేల 500 మంది వరకు సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.
మధ్యాహ్నం ఒంటి గంటా 15నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి పీఎం పాలెంలోని విశాఖ కన్వెన్షన్కు వెళతారు. మధ్యాహ్నం 2గంటల 15నిమిషాల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులో పాల్గొంటారు. రాత్రి ఏడున్నరకు విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8గంటల 20నిమిషాలకు విజయవాడకు పయనమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com