TDP-Janasena Manifesto: ఏపీ భవిత కోసమే ఉమ్మడి ప్రయాణం
అధికారంలోకి వస్తే తమ కూటమి ప్రజలకు ఏం చేస్తుందో తెలిపే పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17న ప్రకటించాలని తెలుగుదేశం - జనసేన నిర్ణయించాయి. చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో...ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు. దిల్లీ పొత్తులపై రేపటికల్లా ఓ స్పష్టత వస్తుందనే అభిప్రాయాన్ని ఇరుపార్టీల నేతలు వ్యక్తం చేశారు.
తెలుగుదేశం- జనసేన ఓ చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించేలా ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న ఇరు పార్టీలను విడదీయడం వైకాపా తరం కాదనే సంకేతాన్ని ఈ సభ ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే వేదికపై కూటమి పూర్తిస్థాయి మేనిఫెస్టో, అభివృద్ధి ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు-పవన్లు ప్రకటిస్తారని ఇరుపార్టీల నేతలు తెలిపారు. అధికార పార్టీ బహిరంగ సభలకు ఇష్టానుసారం బస్సులు కేటాయిస్తున్న RTC ..తమకు మొండిచెయ్యి చూపటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో మాదిరే తమకు బస్సుల కేటాయింపును నిరాకరిస్తే...ఎండీపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామన్నారు.తెలుగుదేశం-జనసేన శ్రేణుల్ని భయపెట్టే పోలీసులపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం - జనసేన పొత్తు పెట్టుకున్నాయని నేతలు తెలిపారు. తమ ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం కోసమేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి జరిగే మేలు ఏంటనేది అధినేతలు ప్రకటిస్తారన్నారు. పోలీసులు గోడలు దూకి జనసేన కార్యాలయంలోకి వచ్చి భద్రతా సిబ్బందిని బెదిరించారని ...వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని తెలుగుదేశం జనసేన నేతలు స్పష్టం చేశారు. వైకాపాపై విపరీతమైన వ్యతిరేకత బీసీల్లోఉందన్నారు. 75వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎందుకు మళ్లించారో చెప్పి ..ఓట్లడగాలని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com