Sankranti 2025: తెలుగు పల్లెలకు సంక్రాంతి శోభ

తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు సంక్రాంతి శోభ వచ్చింది. ఉద్యోగాల కోసం పట్టణం బాట పట్టిన వారందరూ పండుగ వేళ.. సొంతూళ్లకు చేరుకుంటున్నారు. సంక్రాంతిని ఎంజాయ్ చేసేందుకు కుటుంబాలతో బయలుదేరారు. బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఊళ్లకెళ్తే సంక్రాంతి సందడే వేరు. ఏపీలో సంక్రాంతి అనగానే ముందు గుర్తుకొచ్చేది కోళ్ల పందేలే. వాటిని చూసేందుకు ప్రజలు వేరే ప్రాంతాల నుంచి కూడా తరలివస్తుంటారు.
కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు
ఎంత ఖర్చయినా, ఎన్ని ఇబ్బందులున్నా సంక్రాంతికి సొంతూరికి చేరాల్సిందే. సంక్రాంతి రష్ని ఫుల్గా క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. సాధారణ రోజులకంటే టికెట్ల రేట్లు డబుల్ చేశారు. నాన్ ఏసీ టిక్కెట్లను కూడా ఏసీ రేట్లకు అమ్ముతున్నారు. ఆర్టీసీ హౌస్ఫుల్ కావటం కూడా ప్రైవేటు ట్రావెల్స్కి వరంగా మారింది. వెయ్యిలోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500దాకా పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రికి 1500లోపుండే స్లీపర్ టికెట్ని సంక్రాంతికి బాదుడే బాదుడంటూ 4వేల రూపాయలకు పెంచేశారు. వైజాగ్కి ఆర్టీసీ టికెట్ రేటు 2వేల లోపే ఉంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ 3వేల నుంచి 5500 దాకా వసూలు చేస్తున్నాయి.
విమాన ఛార్జీలకు రెక్కలు
సంక్రాంతి పండగక వేళ విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి కనీస ధర రూ.3,400 నుంచి రూ.4 వేలు ఉండగా.. ప్రస్తుతం మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. హైదరాబాద్ నుంచి కనీస ఛార్జీ రూ.17,500, బెంగళూరు నుంచి విశాఖ రావాలంటే కనీసం రూ.12 వేలు ఖర్చు చేయాలి. అయినప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాసతో వేలకు వేలు పెట్టుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు.
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేేశారు. ప్రధాన పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. వాటిని ఉపయోగించే ముందు ఫిట్ నెస్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com