Tirumala: తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు

Tirumala: తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు
నిర్దేశిత సమయం కంటే ముందుగానే టికెట్ల పంపిణీ

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ... తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో తి.తి.దే. విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార సర్వ దర్శనం టికెట్ల జారీ... తితిదే నిర్దేశించిన సమయం కంటే.. ముందుగానే ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు... గురువారం సాయంత్రానికే తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను తి.తి.దే. అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ ప్రారంభించనున్నట్లు... తొలుత అధికారులు ప్రకటించారు. కాగా... గురువారం సాయంత్రానికే టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీగా మోహరించడంతో... వారిని అదుపు చేయడం... తితిదే, పోలీస్ సిబ్బంది వల్ల కాలేదు. భక్తులను అదుపు చేయడంలో విఫలం కావడంతో... గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను ఇస్తున్నారు.

10 రోజుల పాటు రోజుకు 80 వేల మంది శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 25 వేల మంది... సర్వదర్శనం ద్వారా 42 వేల మంది.., శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చిన భక్తులు 2 వేల మందితో పాటు సిఫార్సు లేఖలతో మరి కొంత మందికి దర్శనాలు కల్పించనుంది. పది రోజుల పాటు 2 లక్షల 50 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన తి.తి.దే... మరో 4 లక్షల 20 వేల సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది.

తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ ఉన్నత పాఠశాల, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్‌లోని ZPఉన్నత పాఠశాల, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద.. పది రోజుల పాటు టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story