అమరావతిపై విచారణ నవంబర్‌ 2కి వాయిదా

అమరావతిపై విచారణ నవంబర్‌ 2కి వాయిదా

అమరావతిపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం నవంబర్‌ 2కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అంతర్గత పిటిషన్‌పై ధర్మాసనం విచారణ పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. వైజాగ్‌లో నిర్మించే గెస్ట్ హౌస్‌ను.. రాజధానిలో భాగంగా కడుతున్నారన్న అనుమానం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది గుప్తా వాదనలు వినిపించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడలో గెస్ట్ హౌస్‌ నిర్మాణాల వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచలేదని న్యాయవాది గుప్తా అన్నారు.

విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో ఎన్ని గదులు నిర్మిస్తున్నారో స్పష్టం చేయలేదని.. న్యాయవాది గుప్తా కోర్టులో తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు గుప్తా. ప్రభుత్వం నిర్మించే గెస్ట్ హౌస్‌లు.. చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారని.. అవి అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు అడ్వొకేట్ గుప్తా. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్‌ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి అభ్యంతరలేదన్నారు.

పిటిషనర్‌ తరపును న్యాయవాది గుప్తా లేవనెత్తిన అంశాలపై... ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ తన వాదన వినిపించారు. రాజధానిలో భాగంగా వైజాగ్‌లో గెస్ట్ హౌస్‌ నిర్మాణం చేపట్టడం లేదని అడ్వొకేట్ జనరల్‌ కోర్టుకు తెలిపారు. కాకినాడ, తిరుపతి, వైజాగ్‌లో అద్దెలు ఎక్కువనే కారణంతో.. గెస్ట్ హౌస్‌లు నిర్మిస్తున్నామని ఆయన కోర్టుకు తెలిపారు. జనాభాలో దామాషా ప్రాతిపదికన గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నామని.. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story