ఏపీలో ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కొరవడింది: చినజీయర్ స్వామీజీ

ఏపీలో ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కొరవడిందని త్రిదండి చినజీయర్ స్వామీజీ అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో మొదలైన దాడులు రామతీర్థం ఘటనతో పతాక స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. కాసేపటి క్రితం సింగరాయకొండలో నరసింహస్వామి విగ్రహాల చేతులు ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై స్పందించిన చినజీయర్ స్వామీజీ.. ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. దాడులు జరిగిన ఆలయాల్ని పరిశీలిస్తానని వివరించారు.
ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చినజీయర్ స్వామీజీ ప్రభుత్వానికి సూచించారు. నిఘా విభాగం అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తే.. దాడులకు పాల్పడిన వాళ్లు ఎవరో తేలుతుందని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి నిజాలు వెలికి తీయాలని సూచించారు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలపై కూడా దాడులకు పాల్పడటం సరికాదని చెప్పారు. వ్యక్తులపై ఉన్న ద్వేషాన్ని ఇలా చూపించడం సబబు కాదని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com