TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్, యాత్రికుల వసతి సముదాయాలు, రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 30 గంటల దర్శన సమయం పడుతోంది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నాయి. వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో 80 వేల మందికి అన్నప్రసాదం అందించారు. . పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందిస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్డీ టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com