శ్రీవారి నిధుల మళ్లింపుపై వెనక్కి తగ్గిన టీటీడీ
స్వామి వారి నిధుల మళ్లింపుపై TTD వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను TTD ధర్మకర్తల మండలి లోతుగా అధ్యయనం చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక అంశాన్ని ఐచ్ఛికంగా మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. అంతేగానీ, ఇందులో ఎలాంటి రహస్య అజెండా లేదని.. TTD బోర్డు ఎంతో పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించడం జరిగిందని.. అదే విధంగా బోర్డు తీర్మానాన్ని TTD వెబ్ సైట్లోనూ అప్ లోడ్ చేయడం చేశామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అంశం కొత్తగా తీసుకున్నది కాదని... ఇదివరకే 1987 దేవాదాయ శాఖ చట్టం 30లోని సెక్షన్111(3), జి.ఓ 311, TTD నిబంధన 80 ప్రకారం ప్రభుత్వ ఆమోదం పొందిన మార్గదర్శకాల మేరకు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో TTD పెట్టుబడులు పెట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేయడమైనదని.. అయితే వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో TTD బోర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై అధ్యయనం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఐచ్ఛికాన్ని పరిగణించవలసిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున ఇకపై బ్యాంకులలోనే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడాన్ని TTD కొనసాగిస్తుందని తెలియజేయడమైనది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com