TTD: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో పెను సంచలనం

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే తిరుమల లడ్డూను అపవిత్రం చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ3 నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి తన పాత్రను స్వయంగా అంగీకరించడం కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది. తిరుమల లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యిని కొందరు కంపెనీలు కల్తీ చేశాయని, ఆ విషయాన్ని తెలిసీ కూడా తాను వారి పక్షాన వ్యవహరించానని విజయభాస్కర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో తాను లంచం తీసుకున్నట్లు కూడా ఆయన అంగీకరించడం సంచలనంగా మారింది. నెయ్యి నాణ్యతపై తప్పుడు నివేదికలు ఇచ్చి, కల్తీకి సహకరించినందుకు ప్రతిఫలంగా లంచం అందుకున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది.
సంచలన విషయాలు
కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు అనుకూల రిపోర్టులు ఇచ్చేందుకు ఆయన డబ్బు, బంగారం స్వీకరించినట్లు సిట్ విచారణలో అంగీకరించారు. మరోవైపు.. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. హవాలా మార్గంలో జరిగిన ఈ లావాదేవీలపై సిట్ లోతైన విచారణ జరుపుతోంది. తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్ను డిస్మిస్ చేసింది.
ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు
మరోవైపు నిందితుడి తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్ కోసం వాదనలు వినిపిస్తూ, విజయభాస్కర్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారని, ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు నశింపజేసే ప్రమాదం లేదని పేర్కొన్నారు. అయితే, స్వయంగా నిందితుడే లంచం తీసుకున్నట్లు అంగీకరించడం, కల్తీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడవడం వంటి అంశాలను కోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇరు పక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు స్వభావం, ఆరోపణల తీవ్రత, ప్రజల విశ్వాసాలకు కలిగిన దెబ్బ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులు, నిందితుల వాంగ్మూలాలతో దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లంచం వ్యవహారానికి సంబంధించి డబ్బు లావాదేవీలు, కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

