Pinnelli Victims: పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దంటున్న బాధితులు
మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని... ఫిర్యాదుదారుల తరపు న్యాయవాదులు హైకోర్టుకి నివేదించారు. బెయిలిస్తే ఓట్ల లెక్కింపు రోజున నేరాల్ని పునరావృతం చేస్తారని వాదించారు. ఇప్పటికే తొమ్మిది కేసుల్లో పిన్నెల్లి నిందితుడని... పోలీసులను గాయపరిచి, తీవ్ర నేరాలకు పాల్పడ్డారని పీపీ వాదించారు.న్యాయమూర్తి నేడు నిర్ణయం వెలువరించనున్నారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి హైకోర్టులో వాదనలు వినిపించారు. పిన్నెల్లిపై నమోదైనవి తీవ్ర కేసులని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దని కోరారు.
పిటిషనర్ పూర్వ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజున అరాచకాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు, ప్రస్తుత కేసులు భిన్నమైనవని చెప్పారు. బెయిలిస్తే ఆయన సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, నేరఘటనలను పునరావృతం చేస్తారని చెప్పారు. పోలీసుల తరపున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.....ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి నేరఘటనలను పునరావృతం చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా మరుసటి రోజు అనుచరులతో ర్యాలీ తీసి, ప్రతిపక్ష నేతలను బెదించారని గుర్తు చేశారు. పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకు 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారని, పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పారు.
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ ఇచ్చిందని, ఈ ఉత్తర్వుల ఉద్దేశాన్ని నెరవేరకుండా చూసేందుకు పోలీసులు వరుస కేసులు నమోదు చేసి పిటిషనర్ని అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి షరతులు విధించినా పిటిషనర్ కట్టుబడి ఉంటారన్నారు. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు ముగియడంతో ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com