Pawan Kalyan: విశాఖలో హైటెన్షన్.. పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసులు
Pawan Kalyan: విశాఖలో హైటెన్షన్ కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రస్తుతం విశాఖ నోవాటెల్లోనే ఉన్నారు. పవన్ బస చేసిన హోటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయనను అరెస్టు చేస్తారని, ఆయనను బలవంతంగా సిటీ నుంచి పంపించేస్తారన్న ప్రచారం జోరుగా జరగడంతో పెద్ద ఎత్తున అభిమానులు నోవాటెల్ దగ్గరకు చేరుకున్నారు.
వారికి తాను బస చేసిన గది నుంచే అభివాదం చేశారు పవన్కల్యాణ్. అతడి కోసం రాత్రంతా అక్కడే పడిగాపులు కాసారు అభిమానులు. పవన్కు మద్దతుగా, జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక పవన్ వ్యూహం అర్థంకాకా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో జనసైనికులకు కోర్టులో ఊరట లభించింది. 92 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు..ఆదివారం రాత్రి విశాఖ ఏడో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 70 మందిని హాజరుపరిచారు.
వీరిలో 61 మందికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. A1 నుంచి A9 వరకు నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్ను తీవ్ర గాయం కేసుగా మార్చి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఇక నిన్న సాయంత్రం వైసీపీ సర్కార్ను ఉద్దేశించి ట్విట్టర్లో వరుసగా సెటైర్లు వేశారు పవన్కల్యాణ్. ఈ సెటైరికల్ ట్వీట్లను వేల సంఖ్యలో అభిమానులు షేర్ చేశారు, రీ ట్వీట్ చేశారు. ఉడతా ఉడతా ఊచ్...ఎక్కడికెళ్తావోచ్..రుషికొండ మీద జాంపండు కోస్తావా..మా వైసీపీకి ఇస్తావా..థానోస్ గూట్లో పెడతావా అంటూ ట్వీట్ చేశారు. తర్వాత ఆర్కే బీచ్లో వాకింగ్ చేయాలని ఉంది దీనికి పోలీసులు అనుమతి ఇస్తారా అని మరో ట్వీట్ వదిలారు. పవన్ చేసిన ట్వీట్లకు అభిమానులు మద్ధతు పలుకుతూ వేల సంఖ్యలో రీట్వీట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com