VIZAG METRO: విశాఖ మెట్రోకు అతి త్వరలోనే అనుమతులు

విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ మెట్రోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండు నుంచి మూడు రోజుల్లోనే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశముందని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, మూడు సంవత్సరాల్లో విశాఖ మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖపట్నంలో పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఐటీ రంగం విస్తరించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా నగరానికి వస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు, సెమీ రింగ్ రోడ్, నగర రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. పట్టణ మరియు గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన ప్రాంతీయ వర్క్షాప్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం విశాఖ మెట్రో ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను రైడర్స్ అనే సంస్థ అధ్యయనం చేస్తోందని, ఆ అధ్యయనం మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఈ తొలి దశలో మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒక కారిడార్, ఓల్డ్ పోస్టాఫీస్ నుంచి గురుద్వారా వరకు రెండో కారిడార్, చినవాల్తేరు నుంచి తాటిచెట్లపాలెం వరకు మూడో కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం 46.23 కిలోమీటర్ల మార్గంలో సుమారు 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో మార్గం నిర్మించనున్నట్లు తెలిపారు. అంటే దాదాపు సగం మార్గం ఈ విధానంలోనే ఉండనుంది. విశాఖ మెట్రో ప్రాజెక్టు అమలుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నాయని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు తన వంతు నిధులు కేటాయించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీకి కేంద్రం నుంచి అనుమతి లభించిన తర్వాత పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
ఇక విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కూడా మంత్రి స్పందించారు. విజయవాడలో మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. త్వరలోనే అక్కడ సర్వే పనులు చేపట్టి అనంతరం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించనున్నట్లు చెప్పారు. సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
