West Godavari: మట్టి మాఫియా.. ఏకంగా 45 ఎకరాలు తవ్వేశారు...
west Godavari
![West Godavari: మట్టి మాఫియా.. ఏకంగా 45 ఎకరాలు తవ్వేశారు... West Godavari: మట్టి మాఫియా.. ఏకంగా 45 ఎకరాలు తవ్వేశారు...](https://www.tv5news.in/h-upload/2023/01/13/874292-dig.webp)
గోదారి జిల్లాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎకరాలకు ఎకరాలు స్వాహా అయిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్థానికులకు మింగుడు పడని విషయంగా మారుతోంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపానికి గురవ్వాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మండలంలోని పాతపాడు గ్రామంలో జగనన్న టిడ్కో ఇళ్ల పేరిట ఈ మాఫియా చెలరేగిపోతుంది. ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 45 ఎకరాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి మట్టిని తరలిస్తున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసామని చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై స్థానికుల ఫిర్యాదుతో మొగల్తూరు తహశీల్దార్ అనిత కుమారిని వివరణ కోరగా.. టిడ్కో ఇళ్ల స్థలాల పూడిక చేసేందుకు ఎనిమిది టిప్పర్ లారీలకు మాత్రమే అనుమతి ఇచ్చామి చెపుతున్నారు. ఆ వాహనాలు కాకుండా ఇతర వెహికల్స్ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com