AP: సర్పంచ్ లకు విలువే కాదు వేతనం లేదు

రాష్ట్రంలో సర్పంచ్ల తీరు నానాటికి తీసికట్టుగా మారిపోయింది. ఇప్పటికే సచివాలయాలతో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కాగా గ్రామంలో వాలంటీర్కు ఉన్న గౌరవమే కాదు గౌరవవేతనం కూడా సర్పంచ్లకు లేకుండాపోయింది. పంచాయతీల నిధులన్నీ ప్రభుత్వం దారిమళ్లించగా చాలాచోట్ల సర్పంచ్లే సొంత నిధులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు.ఇప్పుడు వారికి రావాల్సిన గౌరవ వేతనం కూడా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు వేతనం వచ్చినా రాకపోయినా వాలంటీర్లకు మాత్రం ఠంచన్గా ఒకటో తేదీన గౌరవం వేతన అందాల్సిందే. కొద్దిగా జాప్యం జరుగుతుందని తెలిసిన వెంటనే ఠంచన్గా ఒకటో తేదిన ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి గ్రామానికే పెద్దదిక్కైన సర్పంచ్ల గౌరవ వేతనం మాత్రం ప్రభుత్వానికి గుర్తురావడం లేదు. సర్పంచులకు 6 నుంచి 9 నెలలకోసారి వేతనాలందుతున్నా పట్టించుకోవటం లేదు. పంచాయతీ వ్యవస్థ అన్నా.. అందులో కీలకమైన సర్పంచులన్నా వైకాపా ప్రభుత్వానికి మొదటి నుంచీ వ్యతిరేకతే. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి, సర్పంచులకు పోటీగా వాలంటీర్లను ప్రవేశపెట్టింది. కేంద్రం పంచాయతీలకిచ్చిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. సంక్షేమ కార్యక్రమాలను వాలంటీర్ల ద్వారా అమలు చేస్తూ.. సర్పంచులకు ప్రజల్లో విలువ లేకుండా చేసింది. చివరకు వారికి ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్నీ సైతం అందించడం లేదు.
గ్రామ సర్పంచ్లుగా ఎన్నికైన వారిలో చాలామంది స్థితిమంతులు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి ఎన్నికైన పేద సర్పంచులూ ఉన్నారు. ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనమే వీరికి మహా భాగ్యం. వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి నెలా 5 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుండగా....సర్పంచ్లకు ఇస్తున్నది కేవలం 3వేలు మాత్రమే. వీటి చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే సర్పంచ్లకు గౌరవ వేతనం నిధులు కేటాయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో మూడు నెలలకోసారి నిధులిచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనిష్ఠంగా 6 నెలలు, గరిష్ఠంగా 9 నెలలకోసారి కేటాయిస్తున్నారు. నిధులిచ్చాక కార్యదర్శులు బిల్లులు తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం నిధులను విడుదల చేసేలోగానే కార్యదర్శులు పంచాయతీల సాధారణ నిధుల నుంచి సర్పంచులకు గౌరవ వేతనం చెల్లించి ఆ తరువాత సర్దుబాటు చేసేవారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అత్యధిక పంచాయతీలు ఆర్థికంగా దివాళా తీయడంతో సాధారణ నిధులు అత్యవసర పనులకే సరిపోవడం లేదు. MPTC సభ్యులకు సైతం 9 నెలలుగా ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించడం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్ప చెల్లింపులు సాధ్యం కాదని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కనీసం మూడు నెలలకోసారి గౌరవ వేతనం అందేదని... ఇప్పుడు దాని గురించి మరచిపోయే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని ఎంపీటీసీలు వాపోతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com