AP: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

AP: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టారు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలను పోలీసులు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

అధికారమే అండగా అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వైసీపీ రాళ్ల దాడిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్లదాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలి పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.

Tags

Next Story