MODI: ప్రపంచాన్ని ఏకం చేసేది యోగానే

ప్రపంచం అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో... యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. యోగాకు సరిహద్దులు లేవని, ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 3 లక్షల మందితో కలిసి యోగసనాలు వేశారు. ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి ప్రధాని పిలుపునిచ్చారు. యోగా ను ప్రపంచంలోని 175 దేశాలు అనుసరిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. యోగా గ్లోబలైజ్ కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని.. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు. యోగాకు సరిహద్దుల్లేవని, వయసుతో పనిలేదని.. అది ప్రకృతి, ప్రగతి సంగమమని కొనియాడారు. యోగాంధ్ర ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ సర్కారుకు అభినందనలు. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్ఫూర్తిగా నిలిచిందని.. వికసిత్ భారత్ ఆలోచనలకు ఇది రూపమని -ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
యోగా యుద్ధాలను కూడా ఆపగలదు
ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నట్లు తెలిపారు. "దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది. మానవాళి శ్వాస తీసుకోవడానికి, సమతుల్యం చేసుకోవడానికి, తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరమైన విరామ బటన్ యోగా" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని, అదొక జీవన విధానమని అన్నారు. "యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం. ఇది ప్రపంచాన్ని కలిపింది" అని తెలిపారు.
గత పదేళ్లలో యోగా కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది అన్నారు మోదీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత యోగాను అనుసరిస్తున్నారని తెలిపారు. యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు.. దీనికి హద్దులు లేవు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే అత్యుత్తమ మార్గం అని మోదీ చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com