AP: కావలసిన వాళ్ళకే కోట్ల విలువైన కాంట్రాక్టులు

AP: కావలసిన వాళ్ళకే  కోట్ల విలువైన కాంట్రాక్టులు
అన్నింటా జగన్‌కు సన్నిహితంగా ఉండే సంస్థ పెత్తనమే

జగన్‌ ప్రభుత్వం వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతోంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు.. స్మార్ట్‌ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం నిర్వహించిన టెండరే ఇందుకు నిదర్శనం. డిస్కంలకు హుకుం జారీ చేసి ప్రాజెక్టు అంచనాలను తగ్గించినట్లే తగ్గించి.... ఆపై 22.70 శాతం అధిక మొత్తానికి షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు బిడ్‌ను ప్రభుత్వం కట్టబెట్టింది. దీనివల్ల టెండరు ధర కంటే అదనంగా 11 వందల 95 కోట్లను ప్రజలపై భారం మోపింది. జగన్‌కు సన్నిహితంగా ఉండే షిర్డిసాయి సంస్థ పెత్తనమే డిస్కంలపై నడుస్తోంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్న ఆరోపణలున్నాయి.

రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. మూడు డిస్కంల పరిధిలో ఇందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపాలని... ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం విద్యుత్‌ తీగల నుంచి నేరుగా రైతు మోటారుకు కనెక్షన్‌ ఉందని.... భద్రతపరంగా ఎర్తింగ్, మీటర్‌ బాక్సు, సర్వీసు లైను, కెపాసిటర్లు అందించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు డిస్కంలు 6వేల756.36 కోట్లతో అంచనాలను రూపొందించాయి. దీనిపై నిరుడు జులైలో మొదటిసారి టెండరు ప్రక్రియలో షిర్డిసాయి సంస్థ 6వేల 480.21 కోట్లకు పనులు దక్కించుకుంది. టెండరు ధర కంటే 4.08 శాతం తక్కువకే సంస్థ కోట్‌ చేసింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే.. టెండరులో నిర్దేశించిన ధర కొలమానం కాదని, పలు కీలక అంశాలను పరిశీలించలేదని, అందుకే ఆ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం డిస్కంలను ఆదేశించింది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ఆధారంగా కొత్త అంచనాలను తయారు చేయాలని సూచించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారి పిలిచిన టెండర్లను రద్దు చేసిన డిస్కంలు ప్రస్తుత ధరల ప్రకారం రెండోసారి 5వేల 692.35 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాయి. వాటిని 2022 అక్టోబరు 21న ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటి సారి కంటే ఈ సారి టెండర్ల ధరను 15.75 శాతం తగ్గించాయి. ఇందులో కేంద్ర గ్రాంటు 16వందల22.64 కోట్లు పోను.... 4 వేల 69.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ అంచనాలకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మొదటి, రెండోసారి రూపొందించిన అంచనాలు పోల్చినప్పుడు ప్రాజెక్టు వ్యయం వెయ్యీ 64.01 కోట్లు తగ్గాలి. కానీ.., కాగితాల్లో అంచనా మొత్తాన్ని ప్రభుత్వం తగ్గించినా.... గుత్తేదారుకు పనులను కేటాయించేటప్పుడు 22.70శాతం ధరను పెంచేసింది. అంటే.. షిర్డిసాయి సంస్థకు బిడ్‌ను 6వేల 888.03 కోట్లకు కట్టబెట్టింది. దీంతో ఖర్చు తగ్గకపోగా... 11వందల 95.68 కోట్ల భారం ప్రజలపై వేసినట్లయింది.


Tags

Read MoreRead Less
Next Story