ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ కడప రాజకీయం

ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటివరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. వైకాపా నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రకి పాకింది. వైకాపాకి ఓటేయలేదని.. ఆ పార్టీ నాయకులు విశాఖలోని బర్మా కాలనీలో ఒక కుటుంబంపై దాడి చేశారు. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పోలీసులు దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనల్ని సిట్ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెదేపా హయాంలో తమకు ఇల్లు మంజూరైందని..ఇంటి ముందు అమర్చిన శిలాఫలకంలో ప్రధాని మోదీ, అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు చిత్రాలున్నాయని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. ఇంటి ముందు కిళ్లీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని.............. వైకాపా మద్దతుదారులైన లోకేశ్, భూలోక, సాయి, భాస్కర్, చిన్ని, ఆశ అనే వ్యక్తులు, మరికొందరితో కలసి ఈ నెల 15న రాత్రి మద్యం తాగి కొట్టు దగ్గరికి వచ్చారని పేర్కొన్నారు. వైకాపా ప్రాంతంలో ఉండి ఎన్డీయే అభ్యర్థికి ఓటెలా వేస్తారని..... లోకేశ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతులు తిట్టారని తెలిపారు. అనంతరం తమని తలలు పగిలి, రక్తం కారేలా కొట్టారని... తన చెల్లి రమ్యను గర్భిణి అని చూడకుండా కడుపుపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు మణికంఠను కొందరు ఎత్తుకెళ్లి మేకులున్న కర్రతో నుదురు, తల మీద దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడి ఎలా జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను బాధిత కుటుంబం మీడియాకు వివరించింది. దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి వారి ఆర్తనాదాలు రికార్డైన వీడియోను బాధిత కుటుంబం, నాయకులు మీడియాకు చూపించారు. ఎన్నికలు ముందు నుంచి బర్మ కాంప్లో గొడవలు జరుగుతున్నాయని బాధితురాలు నూకరత్నం అన్నారు. కూటమికి ఓటు వేశామన్న విషయం తెలుసుకుని కావాలనే దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. వైసీపీకి మద్దతుగా ఉండట్లేదని సొంతింట్లోనే ఉండకుండా చేస్తున్నారని బాధితురాలు, తల్లి సుంకర ధనలక్ష్మి వాపోయారు.
జీజీహెచ్లో చికిత్స పొందుతుండగా 16వ తేదీ తెల్లవారుజామున పోలీసులు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు. తాము భయాందోళనలతో వణికిపోతూ, పూర్తిగా తెలివిలో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవో ప్రశ్నలు అడిగారన్నారు. తన తల్లి తల పగిలిన గాయానికి 24 కుట్లు, తమ్ముడికి 14 కుట్లు, తనకు ఆరు కుట్లు వేశారని..పోలీసులు ఏమడిగారో కూడా తెలియని అలాంటి పరిస్థితుల్లో సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com