Yuvagalam: జగన్ సర్కార్పై నారా లోకేష్ ఫైర్

జగన్ సర్కార్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం ఒక్క కంపెనీ దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగారా అంటూ ప్రశ్నించారు. గతంలోనే పీపీఏలు రద్దు చేయ్యోద్దని చెప్పామని అయినా ప్రభుత్వం లెక్క చేయలేదని అన్నారు. రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు తరలి వెళ్లిపోయాయని లులూ, ఫాక్స్కాన్, అమరరాజా కంపెనీలు కూడా తెలంగాణకు వెళ్లిపోయాయని విమర్శించారు. ఏపీలో బాగుపడింది భారతి సిమెంట్స్, సాక్షి మీడియా మాత్రమేనని విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో గంజాయి ఫుల్.. ఉద్యోగాలు నిల్ అన్న పరిస్థితి నెలకొందని ఆరోపించారు. సమ్మిట్కు ఒక్క అంతర్జాతీయ కంపెనీ కూడా రాలేదని, అన్నీ ఫేక్ కంపెనీలతో ప్రచారం చేసుకున్నారని అన్నారు.పులివెందులకు చెందిన ఓ కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వారికి 2,500 ఎకరాలు కేటాయింపులు చేశారని అన్నారు లోకేష్.
విశాఖ సదస్సులో చేసుకున్న కొన్ని కంపెనీల ఒప్పందాలు ఫేక్ అన్నారు లోకేష్. లక్ష రూపాయలు కేపిటల్ ఉన్న ఓ కంపెనీ.. రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఇక ఏబీసీ కంపెనీ టర్నోవర్ రూ.120కోట్లు అయితే... లక్షా 20వేల కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. ఆ కంపెనీలో కేవలం 200మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. పాత ఒప్పందాలనే కొత్తవిగా చూపిస్తున్నారన్నారు. ఏపీని దీవాళా తీయించిన జగన్ సర్కారుకు 175కి 175 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు లోకేష్. అన్ని సీట్లు వస్తే...పరదాలు ఎందుకు కట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతానని జగన్కు భయం పట్టుకుందన్నారు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి స్టంట్లు చేస్తున్నారంటూ విమర్శించారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com