Yuvagalam : జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ లేదు : లోకేష్

Yuvagalam : జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ లేదు : లోకేష్

జగన్ ప్రభుత్వంలో మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు లోకేష్‌. నంద్యాల జామియా మసీదు వద్ద మైనార్టీలు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని లోకేష్‌ విమర్శించారు. తమ ఆస్తుల కబ్జాను అడ్డుకున్నందుకు నర్సరావుపేటలో వైసీపీ నేతలు ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని.. మైనార్టీల కోసం అమలుచేసిన రంజాన్ తోఫా, దుల్హాన్ వంటి పథకాలన్నింటినీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జామియా మసీదు అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా స్వర్ణకారులు సాంకేతికంగా అభివృద్ధి సాధించాల్సి ఉందని లోకేష్‌ పేర్కొన్నారు. నంద్యాల కల్పన సెంటర్‌లో స్వర్ణకారులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వర్ణకారుల నూతన డిజైన్ల కోసం అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, అధునాతన పనిముట్లకు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని స్వర్ణకారులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని.. స్వర్ణకార పిల్లలకు ఉన్నత చదువులకు సాయం అందిస్తామని చెప్పారు. స్వర్ణకారుల షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందజేస్తామని అన్నారు.

జగన్‌ కులానికి ఒక కుర్చీ లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసి దారుణంగా మోసగించారని లోకేష్‌ ఫైరయ్యారు. నంద్యాల సాయిబాబా గుడి వద్ద బొందిలి సామాజిక వర్గీయులు లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. అధికారంలోకి వచ్చాక బొందిలి కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అవకాశాన్ని బట్టి పుణ్యక్షేత్రాల్లో సత్రాల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తామని.. బొందిలి సామాజిక వర్గీయుల్లో ఇళ్లులేని వారికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బొందిలి కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై గత నివేదికలను పరిశీలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story