Ranbir Kapoor: ఏడేళ్ల తర్వాత కలిసి నటించనున్న మాజీ ప్రేమికులు..

Ranbir Kapoor: టాలీవుడ్లో ఎవరైనా జంట ప్రేమించుకొని, అనుకోని కారణాల వల్ల విడిపోతే.. మళ్లీ వాళ్లిద్దరూ పొరపాటున కూడా కలవడానికి ఇష్టపడరు. కానీ బాలీవుడ్లో అలా కాదు.. వారు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు అనుకుంటారో ఏమో కానీ మళ్లీ కలిసి నటించడానికి కూడా వెనకాడరు. తాజాగా అలా ఓ మాజీ ప్రేమజంట మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఆలియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు. కానీ తనకంటే ముందు పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేశాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా హీరోయిన్ దీపికా పదుకొనెతో ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు రణబీర్. వీరిద్దరూ ఓపెన్గానే చట్టాపట్టాలు వేసుకొని తిరిగేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ వీరి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లలేదు.
ఇక రణబీర్, దీపికా కలిసి మూడు సినిమాల్లో నటించారు. బ్రేకప్ అయిన తర్వాత కూడా రణబీర్, దీపికా కలిసి సినిమాలు చేశారు. అప్పుడు కూడా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. వీరు చేసిన 'తమాషా' విడుదలయిన ఏడేళ్ల తర్వాత మరోసారి ఈ జంట కలిసి కనిపించడానికి సిద్ధమయినట్టు సమాచారం. కానీ సినిమాలో కాదట.. వీరిద్దరు ఓ యాడ్లో కలిసి కనిపించనున్నారు. దీనికి పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com