మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 6 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. నిందితులకు చార్జిషీట్ పత్రాలు ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడంతో.. ఈ కేసు కీలక మలుపు తీసుకోబోతుందనే చర్చ జరుగుతోంది.
మరో వైపు ఈడీ కేసులో మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇంచార్జి విజయ్ నాయర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కూడా కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. సిసోడియా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది...ఆరు వారాల బెయిల్ కోరుతూ ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఈడీ అభ్యంతరం తెలిపింది. పోలీస్ ఎస్కార్ట్తో.. తన భార్యను పరామర్శించవచ్చని కోర్టుకు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com