పండుగ ఆఫర్ల కోసం ఎగబడ్డ జనం..!!

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీల ఆఫర్ల కోసం ఈ సంవత్సరం కూడా జనం ఎగబడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సగటు జీవి పరిస్థితి కోలుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ.. అమెజాన్, ఫ్లిప్కార్ట్ పండుగ సేల్స్లో రికార్డ్ స్థాయి అమ్మకాలు జరిగాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాలను చెపట్టింది. ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు 'బిగ్ బిలియన్ డేస్' పేరుతో సేల్స్ మొదలు పెట్టింది. ఇక అమెజాన్ అక్టోబర్ 17 నుంచి 23 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరుతో సేల్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ పండుగ ఆఫర్లకు మంచి స్పందన వచ్చింది. సేల్స్ మొదలైనా తొలి రెండు రోజుల్లో భారీగా ఆర్డర్లు నమోదయ్యాయి. కేవలం నాలుగు రోజుల్లోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్.. రెండింటిలో కలిపి రూ.26,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.
ఈ సేల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్ముడుపోయినట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైన 48 గంటల్లో లక్షా 10,000 ఆర్డర్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో.. 66 శాతం ఆర్డర్లు చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చినవే అని వెల్లడించారు. ఇప్పటివరకూ జరిగిన సేల్లో సగానికి పైగా ఉత్పత్తులు వర్క్ ఫ్రం హోం విభాగంలోనివేనని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి తెలిపారు.
గత సంవత్సరం ప్రకటించిన వార్షిక అమ్మకాల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రూ.20,000 కోట్ల అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు రూ.26,000 కోట్ల అమ్మకాలు జరగటం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com