BETTIN APPS BILL: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకే

ఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నారు. అప్పుల పాలై తనువు చాలించిన వారూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిజానికి ఆన్లైన్ గేమింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ఆదాయం కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. డబ్బుతో ముడిపడ్డ ఎలాంటి ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియనైనా ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది. అదే సమయంలో గేమింగ్ పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు 'రియల్ మనీ'తో సంబంధం లేకుండా నిర్వహించే ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ను ప్రోత్సహించడానికి సైతం ఈ బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచింది.
డబ్బులు పెట్టి ఆడే గేమ్లపై
ప్రస్తుతం దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. యువతలో వ్యసనం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలను ప్రధాన ఆందోళనలుగా పేర్కొంటూ నగదు లావాదేవీలతో నడిచే ఆన్లైన్ గేమ్లపై కేంద్రం నిషేధం విధించింది. అంటే డబ్బులు పెట్టి ఆడే అన్ని ఆటలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫాంటసీ క్రీడలు, పోకర్, రమ్మీ వంటి కార్డ్ గేమ్లు, ఆన్లైన్ లాటరీలతో సహా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, జూదంపై నిషేధం విధించింది. గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం విధించారు. ఆన్లైన్ గేమ్లు ఆడేవారిని మాత్రం శిక్షల నుంచి మినహాయించారు. వీరిని బాధితులుగా పరిగణించాలని బిల్లులో పొందుపరిచారు. దీని కోసం గత మూడున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.
యాడ్స్, ప్రమోషన్స్ చేసినా నేరమే
ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025 నిబంధనలను ఉల్లంఘించి డబ్బు ఆధారిత గేమింగ్ సేవలను అందించే సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ఒక రూ.కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఆయా గేమ్లను ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. అంటే గేమింగ్ యాప్ల ప్రకటనల్లో పాల్గొనే సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు సైతం కొత్త చట్టం ప్రకారం శిక్షార్హులే అని బిల్లు స్పష్టం చేస్తోంది. చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ ఉత్పత్తులను 'నైపుణ్య ఆధారిత ఆటలు'గా ముసుగు వేసుకుని, బెట్టింగ్ నుంచి వేరుగా కనిపించేందుకు ప్రయత్నిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొత్త బిల్లు ప్రకారం ఇవన్నీ కచ్చితంగా బెట్టింగ్గానే పరిగణిస్తూ చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించాయి.
ఆందోళనలో ఆన్లైన్ గేమింగ్ రంగం
మరోవైపు డబ్బు ఆధారిత గేమింగ్ రంగంతో సంబంధం ఉన్న సంస్థలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఈ చట్టం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, కేంద్రం మాత్రం ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సాగే ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సామాజిక ఆటలను ప్రోత్సహించడానికి బడ్జెట్, కొత్త పథకాలతో పాటు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు బిల్లు ద్వారా తెలియజేస్తోంది. ఈ రంగం దెబ్బతినకుండా చూడడంతో పాటు ప్రోత్సహించే చర్యలు చేపట్టినట్టు వివరిస్తోంది. లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట రూపం సంతరించుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com