BUDGET2026: బడ్జెట్ 2026.. ఒకే దేశం-ఒకే పన్ను

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి జీవుల నుంచి ఉన్నత శ్రేణి ఉద్యోగుల వరకు అందరి దృష్టి 'ఆదాయపు పన్ను' సంస్కరణలపైనే ఉంది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈసారి విప్లవాత్మక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
లక్ష్యం ఏంటి?
ప్రస్తుతం భారత్లో పాత పన్ను విధానం , కొత్త పన్ను విధానం సమాంతరంగా కొనసాగుతున్నాయి. అయితే, రెండు వేర్వేరు వ్యవస్థల వల్ల పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొనడమే కాకుండా, పన్ను నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, 'ఒకే దేశం - ఒకే పన్ను' నినాదంతో జీఎస్టీని తీసుకొచ్చిన తరహాలోనే, ప్రత్యక్ష పన్నుల్లోనూ ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా పాత పన్ను విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, అందరినీ 'కొత్త విధానం' పరిధిలోకి తీసుకువచ్చే దిశగా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కొత్త విధానం వైపు వ్యూహం
కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్గా ఇప్పటికే మార్చిన ప్రభుత్వం, దానిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని దాదాపు రూ. 7.75 లక్షల వరకు ఉన్న పన్ను రహిత పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది. వార్షిక ఆదాయం రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల లోపు ఉన్నవారికి పన్ను స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా 'జీరో ట్యాక్స్' ప్రయోజనాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎటువంటి పొదుపు పత్రాలు, పెట్టుబడి రశీదులు సమర్పించాల్సిన అవసరం లేకుండా నేరుగా పన్ను మినహాయింపు పొందడమే కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.
పాత విధానం కొనసాగుతుందా?
సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పెట్టుబడి మినహాయింపులు, 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ వడ్డీ రాయితీలు పొందేందుకు చాలామంది పాత విధానాన్నే ఇష్టపడుతున్నారు. అయితే, ఈ మినహాయింపుల వల్ల ప్రభుత్వంపై పడే ఆదాయ భారాన్ని తగ్గించుకోవాలని కేంద్రం చూస్తోంది. ఒకవేళ పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేయకపోయినా, దానిపై పన్ను రేట్లను పెంచడం లేదా కొత్త విధానంలోకి మారే వారికి అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పాత విధానాన్ని క్రమంగా నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. కేవలం వ్యక్తిగత ఆదాయపు పన్ను మాత్రమే కాకుండా, కార్పొరేట్ పన్నుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSME) చేయూతనిచ్చేలా రాయితీలు ఇవ్వాలని, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించేలా పన్ను మినహాయింపులు ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
