GST: త్వరలో సామాన్యులకు గుడ్న్యూస్

ఆదాయ పన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు మరో గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబ్ను పూర్తిగా తొలగించడం లేదా 12 శాతంలో ఉన్న చాలావరకు వస్తువులను 5 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీంతో మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు?
ఈ నిర్ణయం అమలైతే పేద, మధ్య తరగతి ఎక్కువగా వినియోగించే టూత్పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ. 1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, రూ.500-1000 మధ్య ధర ఉండే ఫుట్వేర్, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్ వంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే, ఈ ప్రతిపాదనకు పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీకి సంబంధించిన ఏ మార్పులకైనా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ప్రతిపాదిత వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తే అవి తక్కువ ధరకే పేద, మధ్యతరగతి వర్గాలకు లభిస్తాయి.
ప్రభుత్వ ఖజానాపై భారీ ప్రభావం
కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. పన్ను పరిధి పెరగడంతో పాటు దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని భావిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నిర్ణయాలు తీసుకోవాలంటే జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులో జీఎస్టీ మండలి సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కౌన్సిల్లో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే సామాన్యుడికి ఈ ఊరట దక్కనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను విషయంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని న్యూ టాక్స్ రీజిమ్ కింద రూ.12 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో చేసిన ప్రకటన మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com