GOLD: "గోల్డెన్" ఛాన్స్.. రూ.లక్షకు 3 లక్షలు

GOLD: గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షకు 3 లక్షలు
X
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొన్న వారు ఊహించని రీతిలో భారీ లాభం

బంగారం భారతీయులు పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్‌గా భావిస్తారు. బంగారాన్ని ఆభరణాల రూపంలోనో, నాణేల రూపంలోనో కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కాలం మారుతున్న కొద్దీ బంగారం పెట్టుబడికి కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సార్వభౌమ బంగారు(సావరిన్ గోల్డ్) బాండ్లు. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ వస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొన్న వారు ఊహించని రీతిలో భారీ లాభం పొందనున్నారు. 2017 మే నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల సిరీస్ మెచ్యూరిటీకి చేరుకోవడంతో ఆర్‌బీఐ వాటి రిడెంప్షన్ ధరను, తేదీని తాజాగా ప్రకటించింది. అప్పట్లో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టిన వారు ఇప్పుడు రూ.3 లక్షలు పొందనున్నారు.

అప్పుడు రూ.2,951.. ఇప్పుడు రూ.9,486

సావరిన్ గోల్డ్ బాండ్లు భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇవి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఈ బాండ్లను గ్రాముల రూపంలో కొనుగోలు చేయవచ్చు. 2017-18 సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్ ప్రకటించింది. ఈ బాండ్లను 2017 మే నెలలో జారీ చేశారు. అప్పుడు ఒక గ్రాము బంగారం బాండ్ ధర రూ.2,951గా ఉంది. ఇప్పుడు, 2025 మే 9న వీటి ఫైనల్ ప్రైస్ యూనిట్‌కు రూ.9,486గా ఖరారు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం మీరు ఈ బాండ్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు మీకు సుమారు 33.88 గ్రాముల బంగారు బాండ్లు వచ్చి ఉండేవి. ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ రూ. 3,21,496కి చేరుకుంది. అంటే మీ లాభం రూ. 2,21,496. ఇది కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చిన లాభం మాత్రమే. దీనికి అదనంగా, ఈ 8 ఏళ్లలో మీ పెట్టుబడిపై 2.5 శాతం చొప్పున వడ్డీని కూడా పొందారు.

రెండిప్షన్ ధర నిర్ణయించడానికి నిర్దిష్ట ప్రక్రియ

సావరిన్ గోల్డ్ బాండ్ల రెడింప్షన్ ధరను నిర్ణయించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తారు. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్‌కు ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను రూ.9486గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 28- మే 2 మధ్య ధరల సగటు ఆధారంగా గ్రాము ధరను నిర్ణయించారు. ఇటీవల గోల్డ్ ధర లక్ష మార్కు దాటిన వేళ పసిడి బాండ్లు రిడెంప్షన్‌కు రావడం అప్పటి ఇన్వెస్టర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌ అనే చెప్పాలి. పైగా ఈ బాండ్ల మెచ్చూరిటీ ద్వారా పొందే లాభంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు.

Tags

Next Story