LAYOFFS: మైక్రోసాఫ్ట్లో మరో భారీ లేఆఫ్..?

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కంపెనీ గేమింగ్ విభాగం, ఎక్స్బాక్స్ గ్రూప్ ఉద్యోగులపై ఈసారి ప్రభావం పడనుందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. వచ్చే వారం ప్రారంభంలోనే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశముందని సమాచారం. ఎక్స్బాక్స్ డివిజన్కు చెందిన అనేక బృందాలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగుల తొలగింపు జరగనుంది. గేమ్ డెవలప్మెంట్ స్టూడియోలు, గేమ్పాస్ వంటి డిజిటల్ సేవలు, కన్సోల్ ఉత్పత్తి విభాగాలపై ఈ ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ భారీగా గేమింగ్ విభాగం ఖర్చులను కుదించారు. కొన్ని స్టూడియోలు మూసివేసిన విషయం తెలిసిందే.
గతేడాది Activision Blizzard కొనుగోలుతో కంపెనీపై లాభదాయకత ఒత్తిడి పెరిగింది. 69 బిలియన్ డాలర్లు వెచ్చించిన ఈ డీల్ తర్వాత పునర్వ్యవస్థీకరణకు మైక్రోసాఫ్ట్ దిగింది. ఇందులో భాగంగానే వచ్చే వారం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే అవకాశముంది. గత 18 నెలల్లో ఇదే నాలుగో అతిపెద్ద లేఆఫ్గా భావిస్తున్నారు. ఇందుకు ముందు మైక్రోసాఫ్ట్ మే నెలలో 6,000 మందిని సాగనంపింది. వీరిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్, ప్రొడక్ట్ విభాగాల్లోని వారు. చిన్న, మధ్యశ్రేణి కంపెనీలకు సాఫ్ట్వేర్ సేల్స్ను ఔట్ సోర్సింగ్ చేయడంతో ఇన్హౌస్ టీమ్స్ను తగ్గించారు.
AI, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి కీలక రంగాలపై మైక్రోసాఫ్ట్ దృష్టి పెట్టిన వేళ, ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించేందుకు ఈ లేఆఫ్లు తప్పనిసరి అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 జూన్ నాటికి కంపెనీలో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 45,000 మందికిపైగా మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఉన్నారు. ఇలాంటి వరుస లేఆఫ్లు ఉద్యోగుల భద్రతపై అనేక ప్రశ్నలు కలిగిస్తున్నాయి. హైటెక్ రంగంలో భారీ లాభాలను ఆర్జిస్తున్న సంస్థలు అయినప్పటికీ, వృద్ధి పేరుతో ఉద్యోగుల తక్షణ తొలగింపులు గమనార్హంగా మారాయి.
మైక్రోసాఫ్ట్ గేమింగ్ వ్యూహాన్ని పూర్తిగా పునర్మూల్యాంకనం చేస్తోంది. లాభాపేక్షలతో వ్యయాలను కత్తిరించడం ద్వారా సంస్థ భవిష్యత్తు లక్ష్యాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇది గేమ్ డెవలపర్స్, టెక్ టాలెంట్పై ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com