శాశ్వత వర్క్‌ ఫ్రం హోం అవకాశం : మైక్రోసాఫ్ట్‌

శాశ్వత వర్క్‌ ఫ్రం హోం అవకాశం : మైక్రోసాఫ్ట్‌
ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల పని విధానంపై కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్న..

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల పని విధానంపై కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందు పెట్టింది. అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. హార్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు రావాల్సిందేనని వెల్లడించింది. సగం లేదా అంతకంటే తక్కువ పనిదినాల్లో మాత్రమే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించింది. ఈ ప్రతిపాదనపై ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస ప్రాంతాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇచ్చింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు లేదా విదేశీయలు తమ సొంత దేశాలకు కూడా వెళ్లి పనిచేసే వెసులుబాటు కల్పించింది. కానీ... ఆ మేరకు జీతభత్యాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇందుకు మేనేజర్‌ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత ఆఫీసు పనివేళల్లోనూ మార్పులు చేసే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఇప్పటికే పలు సాంకేతిక దిగ్గజ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని శాశ్వతం చేశాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఉద్యోగుల్లో సగం మందికి పైగా రాబోయే ఐదు నుంచి పదేళ్ల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ట్విటర్‌, స్క్వేర్‌ తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే విధానాన్ని అనుసరించనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story