కొత్తఫోన్ కొనడానికి వెళ్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్!
స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. చిప్సెట్లకు తీవ్ర కొరత నెలకొనడంతో కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటోంది. దీనికి తోడు పన్నుల పెంపు, కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా చిప్సెట్ల కొరత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే మొబైల్ ధరలు పెంచటమే మార్గంగా కంపెనీలు భావిస్తున్నాయి.
మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల 2020 ఏప్రిల్లో మొదటి విడత చోటుచేసుకుంది. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే విడిభాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు సెప్టెంబర్లో మరో విడత పెరిగాయి. ఫోన్ల డిస్ప్లే ప్యానెళ్లపై డ్యూటీని కేంద్రం పెంచడంతో అక్టోబర్లో మరో విడత ధరలు పెరిగేందుకు దారి తీసింది. ఇప్పుడు చిప్సెట్ల కొరత కారణంగా.. ధరలను పెంచితే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది. కాగా ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com