మారటోరియం పొడిగించడం కుదరదు : కేంద్ర ప్రభుత్వం

మారటోరియం పొడిగించడం కుదరదు : కేంద్ర ప్రభుత్వం
2 కోట్లు లోపు రుణాలు తీసుకున్నవారికి మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తాం

కరోనా కాలంలో విధించిన మారటోరియంను... మరింతకాలం పొడిగించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు.. సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని.. రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని... ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. రుణాల చెల్లింపునకు ఇప్పటికే ఆరు నెలల మారటోరియం ప్రకటించామని... దీన్ని మరింత కాలం పొడిగించడం సాధ్యంకాదని తేల్చి చెప్పింది.

రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై.. సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం , RBI సంయుక్తంగా మరో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని... ఇందులో కోర్టుల జోక్యం తగదని కేంద్రం అభిప్రాయపడింది. చక్రవడ్డీ మాఫీ చేయడం కాకుండా.. మరే ఇతర ఉపశమనాలు కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. రంగాలవారీగా ఉపశమనం కల్పించడం కుదరని..అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. అటు RBI కూడా... రుణాల మారటోరియం గడువును మరింతకాలం పెంచలేమని... సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగిస్తే అది వాయిదా చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్ అభిప్రాయపడింది. అంతేగాక రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని పేర్కొంది. ఈ అఫిడవిట్‌పై.. అక్టోబర్‌ 13న కోర్టు విచారణ జరపనుంది.

కరోనా కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటిస్తున్నామని... రుణాలు, వడ్డీలకు సంబంధించిన EMIల చెల్లింపు వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ... మార్చి 27న రిజర్వ్‌ బ్యాంక్ సర్కులర్‌ జారీ చేసింది. తర్వాత ఆ గడువును ఆగస్టు 31వరకు పొడిగించింది. అయితే దీనివల్ల భారమేమీ తగ్గదని, ఆ తర్వాతైనా చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ.. సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా... 2 కోట్లు లోపు రుణాలు తీసుకున్నవారికి మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. గతవారం కేంద్రం ఆ మేరకు అఫిడివిట్ దాఖలు చేసింది. దీనికిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు... రంగాలవారీగా ఎలాంటి ఉపశమనాలు కల్పిస్తారని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేంద్రం... అవన్నీ సాధ్యం కాదని తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story