NVIDIA: చరిత్ర సృష్టించిన ఎన్విడియా

అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా చరిత్ర సృష్టించింది. మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు నెలకొల్పింది. షేరు ధర దాదాపు 5 శాతం పెరిగి 201.03 వద్ద క్లోస్ అయింది. ఈ క్రమంలోమే కంపెనీ మార్కెట్ క్యాప్ ఆల్ టైమ్ హైకి చేరింది. దీనికి గల ప్రధాన కారణాల్లో మొదటిది.. ఎన్విడియా భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం. ఇటీవలే ఏకంగా 500 బిలియన్ డాలర్ల విలువైన AI చిప్ల ఆర్డర్లు పొందింది. అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ కోసం 7 సూపర్ కంప్యూటర్లు తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి అణు ఆయుధాల నిర్వహణకు కూడా సహాయపడతాయి. కంపెనీ సీఈఓ జెన్సెన్ హువాంగ్ వాషింగ్టన్లో కొత్త ప్రాడక్ట్లు, ఒప్పందాలు ప్రకటించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలసీలను మెచ్చుకున్నారు. ఎన్విడియా, ఒరాకిల్ కలిసి 1 లక్ష బ్లాక్ వెల్ AI చిప్లతో అతి శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ తయారు చేస్తున్నాయి. అలాగే ఎన్విడియా నోకియాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. రెండు సంస్థలు కలిసి 6G టెక్నాలజీ అభివృద్ధి చేస్తాయి. ఏఐ నెట్వర్కింగ్, డేటా సెంటర్లను మెరుగుపరుస్తాయి.
అద్భుతమైన జర్నీ
ఎన్విడియా తొలిసారి 2023 జూన్లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. ఆ తర్వాత 180 రోజుల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ఆ తర్వాత కేవలం 66 రోజుల్లోనే 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంది. 2025 జులైలోనే 4 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుని చరిత్ర సృష్టించింది. ఎన్విడియా షేర్లు 6 నెలల్లో 84 శాతం రిటర్నులు ఇచ్చాయి. 1 సంవత్సరంలో 44 శాతం పెరిగాయి. గత 5 సంవత్సరాల్లో 1,500 శాతం పెరిగి మల్టీబ్యాగర్ రాబడులు ఇచ్చాయి. ఇక గత 26 సంవత్సరాల్లో 5 లక్షల శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లపై కనకవర్షం కురిపించింది. ప్పుడు పెన్నీ స్టాక్ అయిన ఎన్విడియా ఇప్పుడు, AI సెక్టార్లో రారాజుగా అవతరించింది. దిగ్గజ అమెరికన్ కంపెనీలను వెనక్కి నెట్టి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా, ఎన్విడియా AI చిప్లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ప్రభుత్వ ఆర్డర్లు, కొత్త భాగస్వామ్యాలతో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది.
తర్వాత మైక్రోసాఫ్ట్, ఆపిల్
ప్రస్తుతం ఎన్విడియా ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్ 4 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మంగళవారం దీని షేరు 4 శాతం పెరిగి 553.72 డాలర్లకు చేరింది. ఇక ఆపిల్ కొత్త ఐఫోన్ డిమాండ్ వల్ల కొద్దిసేపు 4 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటింది. కానీ.. మళ్లీ కిందకు పడిపోయి 3.992 ట్రిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏఐ రంగంలో వెనుకబడిందన్న ఆందోళనలతో ఆపిల్ షేర్లు ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే నెమ్మదిగా రాణించాయి. 2025లో ఇప్పటివరకు ఆపిల్ కేవలం 7.5 శాతం వృద్ధి సాధించగా, ఇదే సమయంలో ఎన్విడియా 50 శాతం, ఆల్ఫాబెట్ 42 శాతం మెటా ప్లాట్ఫామ్స్ 28 శాతం చొప్పున లాభపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

