Petrol : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. భారత్‌‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం

Petrol : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. భారత్‌‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారల్‌ ధర సరికొత్త గరిష్టానికి చేరుకుంటున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దేశంలోనూ పెట్రోధరలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. ఫలితాలు వచ్చి ఆరు రోజులైనా ఇంతవరకు ధరలు పెంపు ప్రస్తావన చేయలేదు కేంద్రం.

మరోవైపు రష్యాపై ఆంక్షలు ఉన్నందున ఆ దేశంలో చమురు నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినందున.. పుతిన్ ఇచ్చే రాయితీతో ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటోంది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చారు.

భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడింది. అందులో రష్యా నుంచి దిగుమతులు 2-3శాతం మాత్రమే. చమురుతో పాటు చాలా ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆఫర్ చేస్తోంది. అయితే, ట్యాంకర్ల కొరత, ఇన్సూరెన్స్, చమురు మిశ్రమాలకు సంబంధించి కొన్ని చిక్కులు ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తమపైనా ఆంక్షలు తప్పవేమో అన్న అనుమానాలతో పలు దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అయితే, ఆంక్షల భయాలు భారత్‌ను నిలువరించలేవని అధికారులు చెబుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 50 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులపైనే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చౌకగా లభించే ముడి సరకులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. రైతులకు ఎరువులపై రాయితీ ఇస్తున్న నేపథ్యంలో ఖజానాపై 20 వేల నుంచి 30 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనుంది. అందువల్ల రష్యాతో పాటు బెలారస్ నుంచి ఎరువులనూ తక్కువ ధరకు దిగుమతి చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story