స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలు..

దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆల్టైమ్ గరిష్ట స్థాయిలను మళ్ళీ తిరగరాశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు యూఎస్ఫెడ్ ప్రకటించడం, ఎవర్గ్రాండే సంక్షోభం ఓ కొలిక్కి రావచ్చన్న సంకేతాలు రావడం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలపర్చాయి. దీనికి తోడు దేశీయంగా వివిధ కార్పొరేట్ అప్డేట్స్తో ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు ఆసక్తి చూపారు. దీంతో ఇవాళ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 60వేల మార్కుకు చేరువలోకి వచ్చింది.
బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మార్కెట్లను లీడ్ చేశాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్కు చక్కని కొనుగోళ్ళ మద్దతు లభించింది. ట్రేడింగ్ మొత్తం మీద సెన్సెక్స్ 958 పాయింట్ల లాభంతో 59 వేల 885 వద్ద, నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17 వేల 823 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్ ను ముగించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com