RBI: బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త రూల్స్

బంగారం తాకట్టు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా రూ.2.5 లక్షల లోపు రుణాలపై లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతం నుండి 85 శాతానికి పెంచుతూ కీలక మార్పులు చేసింది. అయితే రుణాల రిస్క్ను తగ్గించేందుకు అనేక నియంత్రణలను కూడా కలుపుకొంది. ఆర్బీఐ (బంగారం, వెండి తనఖాపై రుణం) మార్గదర్శకాలు 2025’ ప్రకారం.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు ఎల్టీవీ నిష్పత్తిని 80 శాతంగా నిర్ణయించింది. రూ.5 లక్షలకు పైగా రుణాలకు మాత్రం ఎల్టీవీ నిష్పత్తి 75 శాతంగా కొనసాగనుంది. బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ కంపెనీలు రుణాలు మంజూరు చేసేందుకు ఈ నిష్పత్తే ఆధారం. రుణగ్రహీత తాకట్టు పెట్టే బంగారం నికర విలువలో ఆ రోజున రుణ మంజూరుకు అర్హత శాతమే ఎల్టీవీ నిష్పత్తి. బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ విషయానికొస్తే, ఎల్టీవీ మదింపులో రుణ కాలపరిమితి ముగిసేనాటికి తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని (అసలు+వడ్డీ) పరిగణనలోకి తీసుకుంటారు
సందేహాలుంటే...
తనఖా కింద స్వీకరించే బంగారం లేదా వెండి విలువను ఆ లోహం స్వచ్ఛత ఆధారిత ధర ప్రకారంగా లెక్కించాలి. ఇందుకోసం ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ లేదా సెబీ నియంత్రణలోని కమోడిటీ ఎక్స్ఛేంజ్ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలి. గడిచిన 30 రోజుల ముగింపు ధరల సగటు లేదా క్రితం రోజు ముగింపు ధరను ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి. తనఖా బంగారం యాజమాన్యంపై సందేహాలున్నప్పుడు రుణం మంజూరు చేయరాదు. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. తనఖా పెట్టే బంగారానికి రుణగ్రహీతే అసలైన యజమాని అని ధ్రువీకరించే పత్రం లేదా రశీదును కోరాలి. రశీదు లేని పక్షంలో పూచీకత్తుగా సమర్పిస్తున్న లోహానికి తానే అసలైన యజమాని అని తెలిపే స్వీయ ప్రకటిత (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రాన్ని తీసుకోవాలి.
యాజమాన్యం నిర్ధారణ తప్పనిసరి
తనఖా పెట్టే బంగారం మీద రుణగ్రహీతకే హక్కు ఉందని రుజువయ్యే పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. అవసరమైతే స్వీయ ప్రకటిత పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. రుణగ్రహీత పేరునే ఆస్తిగా లేనిపక్షంలో రుణం మంజూరు చేయరాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com