Reliance 5G Services : దీపావళి కానుకగా జియో 5జీ నెట్వర్క్ సర్వీసులు.. ముందుగా ఆ నాలుగు నగరాల్లోనే..

Reliance 5G Services : దీపావళి కానుకగా జియో 5జీ నెట్వర్క్ సర్వీసులు.. ముందుగా ఆ నాలుగు నగరాల్లోనే..
Reliance 5G Services : సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణకు రిలయన్స్ సంస్థ నాంది పలకనుంది

Reliance 5G Services : సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణకు రిలయన్స్ సంస్థ నాంది పలకనుంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు దీపావళి కానుకగా ప్రారంభిస్తామని దిగ్గజ సంస్థ రిలయన్స్​ ప్రకటించింది. తొలుత దేశంలోని నాలుగు మెట్రో నగరాలు... ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలో జియో 5జీ సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. అనంతరం దశలవారీగా వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దేశవ్యాపంగా ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని రిలయన్స్ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టాలనేది జియో లక్ష్యమని.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ స్పష్టం చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. 5 జీ సేవల వివరాలను ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో జియో 5జీ సాంకేతికత కోసం..భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపిన ఆయన... 2 లక్షల కోట్ల మేర ఇన్విస్ట్‌మెంట్‌ ఉండనున్నట్లు ప్రకటించారు. అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లోనే జియో 5జీ సేవలను అందించనున్నట్లు ముఖేష్‌ అంబానీ స్పష్టం చేశారు. అటు భారత్‌ను డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మలిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. ఆల్ట్రా హైస్పీడ్ జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరిట... జియో 5 జీ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని స్పష్టం చేసింది. అయితే 5జీ ఫోన్‌ను గూగుల్‌తో కలిసి తెస్తామన్న రిలయన్స్‌... సామాన్యుడికి అందుబాటు ధరల్లోనే అందిస్తామన్నారు. 5జీ సొల్యూషన్స్‌ కోసం క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది. మరోవైపు, క్లౌడ్ ఆధారిత పీసీ సర్వీసులను సైతం అందించనున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story