Gold prices skyrocketed: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
Gold prices skyrocketed: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్పై, బంగారం ధరలపై పడుతుంది.. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధ ప్రకటనతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం భారత్లో 10 గ్రాముల బంగారం ధర రూ.51వేల మార్కును చేరుకుంది. మల్టీ కమొడిటీ ఎక్సేంజిలో పసిడి విలువ 2.02 శాతం పెరిగి, రూ.51,396కి చేరింది. వెండి ధరలో కూడా రెండు శాతం పెరుగుదల నమోదైంది. దాంతో కిలో వెండి విలువ రూ.65,876కు చేరుకుంది.
ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచమార్కెట్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దాంతో ట్రేడింగ్ బంగారానికి అనుకూలంగా ఉందని ఐసీఐసీఐ నివేదిక పేర్కొంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.9 శాతం పెరిగి 1,943.86 డాలర్లకు చేరుకుంది. 2021 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రెండు శాతానికి ఎగబాకి, 1,949.20 డాలర్లకు పెరిగింది. కాగా, ఫిబ్రవరిలో పసిడి ధరలు ఇప్పటివరకు దాదాపు ఎనిమిది శాతం పెరిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముడి చమురు, డాలర్ విలువలు పెరుగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com