UPI: యూపీఐ యాప్‌లో కొత్త రూల్స్

UPI: యూపీఐ యాప్‌లో కొత్త రూల్స్
X
యూపీఐ యాప్‌లలో బ్యాలెన్స్‌ చెక్‌కు పరిమితి

యూపీఐ లావాదేవీలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ యాప్‌లలో నగదు నిల్వను రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు అవసరమైనన్ని సార్లు బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలు ఉండగా, త్వరలో అది సాధ్యపడదు. ఈ పరిమితి ఒక్కో యాప్‌కి వర్తించనుండటంతో, ఒకే వినియోగదారుడు రెండు వేర్వేరు యూపీఐ యాప్‌లు వాడుతున్నట్లయితే ప్రతి యాప్‌లో 50 సార్లు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే వీలు ఉంటుంది. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం – బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం, అలాగే అవసరంలేని API కాల్స్‌ను నియంత్రించడం.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకే...

NPCI తెలిపిన ఇతర మార్గదర్శకాల ప్రకారం, API ఆధారిత లావాదేవీలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు వినియోగదారుల అనుమతితో మాత్రమే జరగాలి. అదే విధంగా, ఆటోమేటెడ్‌ చెల్లింపులు (SIPs, OTT బిల్స్‌ వంటివి) రద్దీ లేని సమయాల్లోనే ప్రాసెస్‌ చేయాలి. రద్దీ సమయంలో పంపిన డెబిట్‌ అభ్యర్థన ఆమోదించబడినా, చెల్లింపు మాత్రం నిర్బంధం లేని సమయంలోనే జరుగుతుంది. ఈ మార్పుల ద్వారా యూపీఐ సేవలు మరింత స్థిరంగా, వేగంగా, భద్రతగా పనిచేసేలా మారతాయని NPCI ఆశిస్తోంది.

కొత్త రూల్స్‌కు లోబడి పనిచేయాలి.. లేకుంటే

కొత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నట్లు ధ్రువీకరిస్తూ PSPలు హామీ ఇవ్వాలి. వీటిని సక్రమంగా అమలుచేయకపోతే.. కొత్త కస్టమర్ ఆన్‌బోర్టింగ్‌ నిలిపివేత, జరిమానా, API పరిమితులు విధించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రతి ట్రాన్సాక్షన్ అనంతరం బ్యాలెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ పంపాలని బ్యాంకులకు NPCI సూచించింది. ఫలితంగా మాన్యువల్‌గా బ్యాలెన్స్‌ తనిఖీలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. దీంతోపాటు నెట్‌వర్క్ పై లోడ్‌ తగ్గుతుందని అంచనా వేస్తోంది. యూపీఐలో జూన్‌ 30, 2025 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను NPCI జారీ చేసింది. ఇందులో భాగంగా యూపీఐ ట్రాన్సాక్షన్ సమయంలో.. అవతలి వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేసుకున్న పేర్లకు బదులుగా బ్యాంకు రికార్డుల్లో ఉన్న పేరును చూపిస్తుంది. ఫలితంగా డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందో లేదో తెలుసుకోవచ్చు. P2P (పీర్‌ టూ పీర్‌), P2PM (పీర్‌ టూ పీర్‌ మర్చంట్‌) లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది.

Tags

Next Story