YEAR END: టెక్ కంపెనీలలో ఏఐ కలకలం @2025

YEAR END: టెక్ కంపెనీలలో ఏఐ కలకలం @2025
X
టీసీఎస్ నుంచి అమెజాన్ వరకు.... లక్షల మంది ఉద్యోగులపై వేటు .. ఖర్చును తగ్గించిన ఏఐ 

ఈ ఏడాది కూడా టెక్ కంపెనీల్లో అదే అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో వేలాదిగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆయా కంపెనీలు ఏఐ వినియోగాన్ని పెంచేందుకు.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు.. పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఈ ఏడాది టీసీఎస్ నుంచి మొదలుకొని అమెజాన్ వరకు టాప్ టెక్ కంపెనీల్లో లక్ష మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్నింటా దీని వినియోగం పెరిగిపోతోంది. ఇది నేరుగా ఉద్యోగులపైనా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఏఐ రాకతో.. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్నీ తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ.. మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో జనం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది టెక్ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా కంపెనీలు తమ కార్యనిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు.. సామర్థ్యం పెంచుకునేందుకు ఏఐపై ఆధారపడుతున్నాయి. ఆటోమేషన్‌వైపు మొగ్గుచూపుతూ.. ఏ మాత్రం కాస్త నైపుణ్యాలు తక్కువగా ఉన్నా.. ఉద్యోగుల్ని ఉన్నట్లుండి లేఆఫ్స్ విధిస్తున్నాయి. 2023 నుంచి ఈ లేఆఫ్స్ పరంపర మొదలైంది. 2025 సంవత్సరంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్క టెక్ రంగంలోనే ఏకంగా లక్ష మందికిపైగా ఉద్యోగులు.. తమ ఉద్యోగాల్ని కోల్పోవడం జరిగింది. ఇండిపెండెంట్ లేఆఫ్స్ ట్రాకర్ లేఆఫ్స్.FYI ప్రకారం.. ఈ ఏడాది 551 టెక్ కంపెనీలు 1,22,549 మంది టెక్ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించేశాయి. వీటిల్లో మెజార్టీ వాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సేల్స్ ఫోర్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లదే. వీటిల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.

ఒకవైపు సుంకాల మోత.. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ.. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీల గురించి చూద్దాం. అంతర్జాతీయ ఇ- కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది అక్టోబరులో ఏకంగా 14 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత. ఏఐపైనే విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కూడా 2025లో 15 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇందులో ఒక్క జులైలోనే 9 వేల మందిని లేఆఫ్ చేసింది. భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కూడా ఈ జాబితాలో ఉంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతానికి సమానమైన 12 వేల మంది ఉద్యోగుల్ని టీసీఎస్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించడం ఐటీ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. చిప్ మేకింగ్ దిగ్గజం ఇంటెల్ జులైలో తమ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2024 చివరికి 1,09,800 గా ఉండగా.. 2025 చివరికి 75 వేలకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది.

Tags

Next Story