Zomato: తొలిసారిగా లాభాల్లోకి వచ్చిన జొమాటో, 12 శాతం పెరిగిన షేర్లు

స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ షేర్లు శుక్రవారం 12 శాతం వరకు దూసుకెళ్లాయి. గురువారం 86.22 వద్ద ముగిసిన జొమాటో షేర్ ధర శుక్రవారం 12 శాతం పెరిగి 98.39 వరకు చేరుకుంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో 10 శాతానికి పైగా పెరిగి రూ.95.43 వద్ద ముగిసింది.
గురువారం రోజు జొమాటో కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల చేయడమే దీనికి నేపథ్యం. కంపెనీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు నష్టాల్లోనే ఉంది. ఈ త్రైమాసికంలో రూ.2 కోట్ల లాభాయాన్ని ఆర్జించినట్లు వెల్లడించడంతో ముదుపర్లు కంపెనీ పనితీరుపై ఆశావహంగా ఉన్నారు. అయితే కంపెనీ గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.186 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం గణనీయంగా పెరగడంతో లాభాల్లోకి వచ్చింది. కంపెనీ ఆదాయం కూడా గత సంవత్సరం త్రైమాసికంతో పోలిస్తే 71 శాతం పెరిగి రూ. 1,414 కోట్ల నుంచి 2,416 కోట్లకు పెరిగింది.
జొమాటో కంపెనీ 2021 సంవత్సరం జులై నెలలో స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.76 అధికంగా రూ.115 వద్ద స్టాక్ మార్కెట్లో నమోదైంది. కానీ తర్వాత గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఒకానొక దశలో సగానికి పైగా నష్టపోయింది.
కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ ఈ సందర్భంగా షేర్ హోల్డర్లకి ఒక లేఖ ద్వారా స్పందన తెలియజేశాడు. వ్యాపార విధానాల్ని మరింత సరళతరం చేస్తామని, సమర్థులైన వారిని వారికి తగ్గ స్థానాల్లో నియమిస్తామని వెల్లడించాడు. వచ్చే త్రైమాసికాల్లో కూడా ఈ లాభదాయకతను కొనసాగిస్తామన్నాడు. మేము తీసుకున్న నిర్ణయాలు మేము ఊహించిన దాని కంటే వేగంగా మా వ్యాపారాన్ని గణనీయంగా మార్చాయని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com