Allu Arjun : పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ - బన్నీ

Allu Arjun :  పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ - బన్నీ
X

అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే 449 కోట్లు వచ్చాయని పోస్టర్ వేశారు. అయితే 500 కోట్ల మార్క్ దాటిందని.. డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు అంటూ తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో చెప్పారు నిర్మాతలు. ఇక మీట్ లో సుకుమార్ ఈ మూవీ ప్యాన్ ఇండియా రేంజ్ కు వెళ్లడానికి రాజమౌళి కారణం అని ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. చివరగా మాట్లాడిన అల్లు అర్జున్ కాస్త తడబడుతూ.. పవన్ కళ్యాణ్ తో ఉన్న ఇష్యూకు ఎండ్ కార్డ్ వేసేలా మాట్లాడాడు.

‘ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగువాళ్లందరితో పాటు ఇండియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. మీ ప్రేమకు సంతోష పడిపోయాను. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలీ, హిందీ, బెంగాలీ ఇండస్ట్రీస్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. నా సినిమా వస్తోందని తెలిసి మీ మీ భాషల్లో ఆల్రెడీ రిలీజ్ డేట్ వేసిన సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుని నాకు సోలో రిలీజ్ ఇచ్చినందుకు మీ రుణం తీర్చుకోలేను. రాబోయే రోజుల్లో మీ సినిమాలు డబ్ అయితే మేకు ఆ సపోర్ట్ అందిస్తాం. అడిగిన వెంటనే టికెట్ ప్రైస్ పెంచుకునేందుకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి( ఇక్కడ పేరు తెలియక బాగా తడబడ్డాడు బన్నీ. పక్కన ఉన్నవాళ్లు రేవంత్ రెడ్డి అని చెబితే అప్పుడు కాసిన్ని నీళ్లు తాగి దాన్ని కవర్ చేసుకుంటూ పేరు పలికాడు) గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారికి, అలాగే తెలంగాణకు ఏ మాత్రం తగ్గకుండా ఏపిలో కూడా అదే స్థాయిలో మమ్మల్ని సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడుగారికి థ్యాంక్స్. చంద్రబాబు నాయుడుగారూ .. మీరు ఎప్పుడూ.. సినిమా వారిని ప్రత్యేకంగా చూశారు. చూస్తున్నారు. ఇక అక్కడ ఆ రేట్ రావడానికి ప్రధాన కారణమైన ఏపి డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ గారికి వెరీ థ్యాంక్స్. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ..’అంటూ ఆ గొడవకు ముగింపు పలికే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. అయితే ఏపి డిప్యూటీ సిఎమ్ కందుల దుర్గేశ్ పేరు మర్చిపోయాడు బన్నీ. అప్పుడూ పక్కన ఉన్నవాళ్లు చెప్పారు. ఆయనకూ థ్యాంక్స్ చెప్పాడు.

ఇక ఈ మూవీతో తనను సుకుమార్ ఎత్తి అక్కడ పెట్టాడు అంటూ చెయ్యి పైకెత్తి చెప్పడం చూస్తే అందరికంటే పైన అన్నట్టుగా ఉంది. అయినా వెంటనే ఇది నేను అహంకారంతో చెప్పడం లేదు.. ఆనందంతో చెబుతున్నా అన్నాడు.

ఇక చివర్లో .. ‘20యేళ్లుగా నేను థియేటర్స్ లో సినిమాలు చూడటానికి వస్తున్నాను. కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆవిడ చనిపోయారని నాకు తర్వాతి రోజు ఉదయం తెలిసింది. వెంటనే ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో నాకు చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. ఈ దుర్ఘటన వల్ల మా సినిమా బ్లాక్ బస్టర్ ఆనందం కూడా తగ్గిపోయింది. వారికోసం నేను 25 లక్షలు ఇస్తా అని ఆల్రెడీ చెప్పాను. ఇదేం కాంపన్సేషన్ కాదు. రాబోయే రోజుల్లో వారికి ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ప్రస్తుతం వాళ్లు శోకంలో ఉన్నారు. అంతా సెట్ అయ్యాక పర్సనల్ గా వెళ్లి కలుస్తాను..’ అంటూ ముగించాడు.

Tags

Next Story