Bhairavam Review : ముగ్గురు హీరోల భైరవం హిట్టా ఫట్టా.. కంప్లీట్ రివ్యూ

Bhairavam Review :  ముగ్గురు హీరోల భైరవం హిట్టా ఫట్టా.. కంప్లీట్ రివ్యూ
X

రివ్యూ : భైరవం

ఆర్టిస్ట్స్ : బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ, అజయ్, వెన్నెల కిశోర్, సంపత్ తదితరులు

ఎడిటర్ : చోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ : హరి కే వేదాంతమ్

మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల

నిర్మాత : కేకే రాధా మోహన్

దర్శకత్వం : విజయ్ కనకమేడల

ముగ్గురు హీరోలతో సినిమా అనేది విని చాలా రోజులైంది. అందుకే భైరవం మొదలైనప్పుడు అంతా ఆసక్తిగా చూశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ కాంబినేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ఇది ఆల్రెడీ హిట్ అయిన మూవీకి రీమేక్. ఇంకేం.. తెలుగులోనూ మంచి విజయం సాధించే అంశాలన్నీ ఉన్నాయి. ఎటొచ్చీ.. మన ఆడియన్స్ కు తగ్గ మార్పులు, చేర్పులూ ఉన్నాయా లేదా అనేదే ఇంపార్టెంట్. అది కూడా ఉందనిపించేలా కాన్ఫడెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది భైరవం టీమ్. మరి ఇవాళ విడుదలైన భైరవం ఎలా ఉందో చూద్దాం.

కథ :

వరద ( నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరి తండ్రులు కూడా అంతే. వారి ద్వారానే వీరూ స్నేహితులవుతారు. వీరికి శీను(సాయి శ్రీనివాస్) అనే అనాథతో పరిచయం అవుతుంది. గజపతి శీనును తన వద్దే ఉంచుకుంటాడు. అలా వరదా, గజపతి ఇద్దరూ ఊరి పెద్దలుగా ఉంటూ ఆ ఊరిలోని వరాహ అమ్మవారి ఆలయ బాగోగులు చూస్తుంటారు. శీను.. వెన్నెల( అదితి శంకర్)ప్రేమించుకుంటుంటారు. అంతా హ్యాపీ అనుకుంటోన్న టైమ్ లో ఆ ఆలయానికి సంబంధించిన 75 ఎకరాల దేవుడి మాన్యంపై దేవాదాయ శాఖ మంత్రి కన్ను పడుతుంది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలనుకుంటాడు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తాడు. చివరగా గజపతికి డబ్బు ఎరవేసి ఒప్పిస్తాడు. కానీ అది జరగాలంటే వరదాను దాటాలి. మరి వరద.. గజపతి ప్రతిపాదనను ఒప్పుకున్నాడా లేదా..? ఎంతోమంచి స్నేహితులైన వీరి మధ్య ఆ దేవుడి మాన్యం వల్ల వచ్చిన సమస్యలేంటీ.. ఈ సమస్యల వల్ల వారి జీవితాలు ఏమయ్యాయి అనేది మిగతా కథ.

ఎలా ఉంది ?

ఈ కథ ఆల్రెడీ తమిళ్ లో విజయం సాధించింది. తెలుగులో కాస్టింగ్ వల్ల కలర్ ఫుల్ గా మారింది. దేవుడి మాన్యం భూముల చుట్టూ గొడవలు అనేది తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో ఉన్నదే. దానికి స్నేహాన్ని మిక్స్ చేసి.. డబ్బు ఎంత గొప్ప మనుషులనైనా విడదీస్తుంది అని చెప్పే ప్రయత్నం కనిపిస్తుందీ మూవీలో. ఇదీ కొత్త పాయింటేం కాదు. కానీ చాలా కొత్త సెటప్ లో కథనం సాగుతుంది. అదే సినిమాకు బలమైంది. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉండటం ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం. హీరోలను రొటీన్ గా ఫైట్ సీన్స్ తో పరిచయం చేసినా.. దాంతో వారి క్యారెక్టరైజేషన్ ను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. శ్రీనివాస్ పాత్ర ఆద్యంత సాధారణంగా కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ సగం తర్వాత విశ్వరూపం చూపిస్తాడు. తొలి సగంలో ఈ మూడు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఏమంత ఆకట్టుకోవు. నాన్ సింక్ లో సీన్స్, రెండు పాటలు పడ్డాయి. అవి కాస్త భరించగలిగితే.. ఇంటర్వెల్ సగం నుంచి ఓ సంఘర్షణ మొదలవుతుంది. ఆ సంఘర్షణ నుంచి వీరి స్నేహం చెడకుండా చూసుకోవడం.. అదే సయమంలో గజపతి తను అనుకున్నది సాధించాలనుకోవడం.. వీరికి అనుసంధానంగా శ్రీను పాత్ర సాగడం.. ఆలయ భూములను తెచ్చేందుకు వరదాను ఊరిలో లేకుండా చూసే ప్రయత్నం .. అతను తిరిగి రావడం.. ఏకంగా అతన్నే చంపేయాలనుకున్నప్పుడు స్నేహితులంతా ఒకటై.. కాపాడుకోవడం.. ఆ క్రమంలో శీను అనుకోకుండా గజపతి బావమరిది చెయ్యి నరకడం.. ఆపై నగల వ్యవహారం.. ఇవన్నీ కథనాన్ని రక్తి కట్టిస్తూ ఓ మంచి ఫ్రెండ్షిప్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ చూస్తున్న ఫీలింగ్ ను తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత కథనంలో మరింత వేగం పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఎక్కడా బోర్ లేకుండా.. ప్రతి పాత్రలోనూ కొత్త రంగులు బయట పడుతూ.. చివరికి తమలో తామే పగస్తులుగా మారిపోవడం.. ప్రీ క్లైమాక్స్ లో మామిడి తోటలో వచ్చే యాక్షన్ సీన్ తో కథ మరో మలుపు తిరగడం.. అప్పటి నుంచి శీను డామినేషన్ తో క్లైమాక్స్ వరకూ కళ్లు తిప్పుకోనివ్వకుండా మంచి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుటుంది. దీంతో ఓ మంచి మాస్ ఎంటర్టైనర్ చూశాం అనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు వచ్చేస్తారు అనడంలో డౌటేం ఉండదు. కాకపోతే మొదటి నలభై నిమిషాల వరకూ సినిమా కాస్త ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఎవరి ఎక్స్ ప్రెషన్ లో కూడా నిజాయితీ కనిపించదు. కొన్ని సీన్స్ అయితే ఇవెందుకు ఇప్పుడు అన్నట్టుగా ఉంటాయి. ఎప్పుడైతే కథలో పాత్రల మధ్య ఓ సంఘర్షణ మొదలవుతుందో అప్పటి నుంచి చూస్తూ ఉండిపోతారు.

నటన పరంగా..

ముగ్గురూ పోటా పోటీగా నటించారు. ఎవరికి వారు ఆయా పాత్రల్లో జీవించారు. మనోజ్ పాత్ర ఎక్కువ సర్ ప్రైజ్ చేస్తుంది. ముగ్గురిలో బెస్ట్ అంటే నారా రోహిత్ నటన అనే చెప్పాలి. వరదా పాత్రలో ఒదిగిపోయాడు. అతని ఎక్స్ ప్రెషన్స్, పాత్రలోని నిజాయితీని పలికించిన విధానం అదిరిపోయింది. అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఇది గొప్పగా గుర్తుండిపోతుంది. అమాయకత్వం, ఆక్రోశం నిండిన పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాగా నటించాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు కూడా. జయసుధ పాత్ర గుర్తుండిపోతుంది. హీరోయిన్లలో దివ్యా పిళ్లై అదరగొట్టింది. సెకండ్ హాఫ్ లో తనకు నటించే అవకాశం వచ్చింది. బాగా చేసింది. ఆనంది పాత్ర పైకి నవ్వుతూనే చిచ్చులు పెట్టే పాత్ర. బాగా చేసింది. అదితిది రొటీన్ రోల్ అయినా చాలా హుషారుగా ఉంది. ఇతర పాత్రల్లో అజయ్, సంపత్, సందీప్ రాజ్, శరత్ లోహితాస్య పాత్రల మేరకు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోయారు. వెన్నెల కిశోర్ రెండు సీన్స్ కే పరిమితం అయ్యాడు.

టెక్నికల్ గా

శ్రీ చరణ్ పాకాల పాటలు ఆల్రెడీ ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తాయి. దర్శకుడుగా విజయ్ కనకమేడల మరీ కొత్తగా ఏం చేయలేదు. తమిళ్ మూవీని మాగ్జిమం మక్కీకి మక్కీ దించే ప్రయత్నం చేశాడు. ఇందులో డైలాగ్స్ కూడా ఉండటం ఆశ్చర్యం. అతని వరకూ పెద్దగా కష్టపడలేదు. ఒరిజినల్ ను ఫాలో అయ్యాడు. మరీ కొత్తదనం కోసం చూసినా అసలుకే ప్రాబ్లమ్ అనుకున్నాడేమో.. కానీ దర్శకుడుగా పాస్ మార్కులు కొట్టేశాడు అనే చెప్పాలి.

ఫైనల్ గా : మాస్ కు ఫుల్ మీల్స్

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story